పెళ్లి మండపంలో వరుడ్ని గుర్తించని వధువు.. దాడితో ఆసుపత్రిపాలు
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. వాట్సాప్లో పెళ్లి నిర్ణయం.. నిజ రూపం చూసి షాక్కు గురైన వధువు
లక్నో ముచ్చట్లు:
సోషల్ మీడియా పరిచయం ఓ యువకుడిని ఆసుపత్రిపాలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ జంట ప్రేమలో పడగా, చివరకు పెళ్లి మండపం వద్ద జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. హర్దోయ్కు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో “రాహుల్ మిశ్రా” పేరుతో పరిచయమైన వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్ల ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మే 12న యువతి కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేశారు. వరుడిగా 23 ఏళ్ల దేవేంద్ర సింగ్ పరిమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే పెళ్లి మండపంలో వరుడి అసలు రూపం చూసిన వధువు ఒక్కసారిగా షాక్కు గురైంది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఇతడు కాదంటూ పెళ్లికి నిరాకరించింది.
సోషల్ మీడియాలో ఫిల్టర్లు, ఎడిటింగ్ ఫోటోల కారణంగా తాను మోసపోయానని యువతి ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన వధువు బంధువులు వరుడిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వరుడిపై దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎస్ఐ.. “సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకునే వారు నిజమైన వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి. ఫిల్టర్లు, ఎడిటెడ్ ఫోటోల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు” అని సూచించారు.
Tags: A Full Stop to ‘Filtered’ Love!