అమెరికా అటార్నీగా సాయి శ్రీనివాస్ రెడ్డి
కడప ముచ్చట్లు:
కడప జిల్లా పులివెందులకు చెందిన యువకుడు అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి కుమారుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో లైసెన్స్డ్ అటార్నీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే, తొలి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించి ఆయన తెలుగు జాతికి కీర్తిని అమెరికాలో చాటిచెప్పారు. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పులివెందుల వాసి సాయి శ్రీనివాస్ రెడ్డి 25 ఏళ్లకే తొలి ప్రయత్నంలోనే అమెరికాలో లైసెన్స్ పొందిన న్యాయవాదిగా ప్రమాణం చేయడం యావత్ తెలుగు సమాజానికి గర్వకారణం. భారత్, అమెరికా రెండింటిలోనూ న్యాయవాదిగా లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా శ్రీనివాస్ రెడ్డి అరుదైన ఘనత సాధించారంటూ లోకేశ్ తన ట్వీట్లో కొనియాడారు.భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అలయన్స్ యూనివర్సిటీ నుంచి బీబీఏ, ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేశారు. ఆతర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో సమ్మర్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నారు. ఇటీవలే ఇండియానా బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఇప్పుడు ఆయన భారత్, అమెరికా దేశాల్లో ఏకకాలంలో లీగల్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. సాయి శ్రీనివాస్ తండ్రి భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ రాయలసీమ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో న్యాయ రంగంలో తనదైన ముద్ర వేయడం పట్ల రామ్ గోపాల్ రెడ్డి ఉబ్బితబ్బిబవుతున్నారు.
Tags: Lucky Break for TDP MLC’s Son