May 11, 2026
Explore
మే 23 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 23 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

May 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

మే 27న గరుడసేవ – మే 30న రథోత్సవం

మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

వాహనసేవల విశేషాలు

మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

మే 24 – చిన్నశేష, హంస వాహనాలు
ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు.

మే 25 – సింహ, ముత్యపుపందిరి వాహనాలు
ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి.

మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు
ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

మే 27 – మోహినీ అవతారం, గరుడసేవ
ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించనుండగా, రాత్రి జరిగే గరుడవాహనసేవ బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

మే 28 – హనుమంత, గజ వాహనాలు
ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనసేవలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తనున్నాయి.

మే 29 – సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు
ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.

మే 30 – రథోత్సవం, అశ్వవాహనం
ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుండగా, రాత్రి అశ్వవాహనసేవ నిర్వహించనున్నారు.

మే 31 – చక్రస్నానం, ధ్వజావరోహణం
ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను పవిత్రజలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tags:Annual Brahmotsavams of Sri Govindaraja Swamy from May 23rd.