- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్రెడ్డి కృషి ఫలితమే
- ప్రజలకు, అధికారులకు మున్సిపల్ చైర్మన్ కృతజ్ఞతలు
- పాలక వర్గానికి వీడ్కోలు
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి కృషి ఫలితంగా మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంపికి, ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామంటు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా చివరి రోజు తెలిపారు. మంగళవారం కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం చివరి సమావేశం జరిగింది. అనంతరం మాజీ ఎంపి రెడ్డెప్ప, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్లు కలసి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ సిఆర్.లలితకు పాలకవర్గ సభ్యులకు సన్మానం చేసి వీడ్కోలు పలికారు.
సాధారణ వ్యక్తికి అందలం….
సాధారణ కార్మికుడుగా ఉన్న తనను మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసి తన కుటుంభానికి, ముస్లింలకు వైఎస్సార్సిపి ప్రభుత్వంలో అత్యున్నత గౌరవం లభించిందని చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపితో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల తన పదవికాలంలో రెండేళ్లపాటు కరోనా కష్టాలలో అందరి సహకారంతో ప్రజలకు అత్యున్నత సేవలు అందించడం మరుపురాని సంఘటన అని తెలిపారు.
అభివృద్ధి పనులు….
మున్సిపాలిటి ప్రజలకు అత్యన్నత సేవలు అందించి, 31 వార్డులలోను సుమారు ఈ ఐదేళ్ల కాలంలో రూ.18 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే కమ్యూనిటి హాళ్లతో పాటు పట్టణంలో ఆర్టీవో ఆఫీసు, వైఎస్సార్ అర్భన్ హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా జరగని అభివృద్ధి ఐదేళ్లలో జరిగిందన్నారు. పట్టణంలో 99 సీసీ రోడ్లు, 84 కాలువలు నిర్మించినట్లు చైర్మన్ తెలిపారు. అలాగే 51 బోర్లు వేయడం జరిగిందన్నారు. ఇవి కాక పట్టణంలో చిన్నచిన్న కల్వర్టులు, రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. పట్టణంలో ఇప్పటి వరకు 286 పనులను చేపట్టి, ఎక్కడ అవినీతి అక్రమాలకు తావులేకుండ పారదర్శక పాలన పనుల్లో అమలు చేశామని తెలిపారు.
సోలార్ పవర్ ఏర్పాటు….
రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటిలోను లేని విధంగా తొలిసారిగా పుంగనూరు మున్సిపాలిటిలో సోలార్ప్లాంటును రూ.7 కోట్లతో ఏర్పాటు చేశామని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాతెలిపారు. ప్రతి నెల సుమారు రూ.35 లక్షలు విద్యుత్ చార్జీలు చెల్లిస్తుండటంతో మున్సిపాలిటి అభివృద్ధికి నిధులు కొరత ఏర్పడిందన్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకుని సమ్మర్స్టోరేజ్ ట్యాంక్ వద్ద సోలార్ప్లాంటు ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటికి ప్రతినెల సుమారు రూ.10 లక్షల మేరకు విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు.


Tags: Unprecedented Development in Punganur Municipality