May 4, 2026
Explore
ఏపీలో మళ్లీ ‘నక్ష’ సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు

ఏపీలో మళ్లీ ‘నక్ష’ సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు

May 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ ‘నక్ష’ ప్రాజెక్టు కింద డ్రోన్ల సహాయంతో సర్వే పునఃప్రారంభం

క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ద్వారా ఆస్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సులభతరం

బ్యాంకు రుణాలు పొందడం, మున్సిపల్ ప్రణాళికల రూపకల్పనకు ఈ కార్డులు కీలకం

2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం

ఏపీలోని నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజల ఆస్తులకు పటిష్ఠమైన భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలతో కూడిన ‘ప్రాపర్టీ కార్డు’లను జారీ చేయాలని నిశ్చయించింది. ఇందుకోసం గతంలో మధ్యలోనే నిలిచిపోయిన ‘నక్ష’ (నేషనల్‌ జియోస్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌) ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సర్వేను పునఃప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రామాల్లో ‘స్వామిత్వ’ పథకం తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల ఆస్తులను ఆధునిక డ్రోన్లు, జీఐఎస్ టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేయాలని కేంద్రం 2024లో ‘నక్ష’ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 152 నగరాలు, పట్టణాలను ఎంపిక చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కుప్పం, అనంతపురం వంటి తొమ్మిది నగరాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నగరాల్లో సర్వే ప్రక్రియ కొంతవరకు జరిగినా, రికార్డుల నమోదు, మ్యాపింగ్ వంటి కీలక పనులు పూర్తికాలేదు. దీంతో వాస్తవ గడువు ముగిసినప్పటికీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఆస్తి యజమానికి ఒక ప్రాపర్టీ కార్డు లభిస్తుంది. ఈ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు (విస్తీర్ణం, హద్దులు, యజమాని వివరాలు) సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా, ఈ కార్డులను ప్రామాణికంగా చూపి బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు, మున్సిపల్ అధికారులకు తమ పరిధిలోని ఆస్తులపై స్పష్టమైన సమాచారం ఉండటంతో నగర ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన మరింత సులభతరం అవుతుంది. త్వరలోనే ఈ సర్వే పునఃప్రారంభంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత రానుంది.

Tags: ‘Naksha’ Survey Returns to AP: Every Household to Receive a Unique Property Card