: ఆచార్య ఆంజనేయులు
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తి, తాత్వికత, మానవీయ విలువల సమ్మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ సాహిత్య సంపదగా నిలిచాయని హైదరాబాద్ కు చెందిన ఆచార్య ఆంజనేయులు తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాహితీ సదస్సులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన “ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అన్నమయ్య ప్రత్యేకత” అంశంపై మాట్లాడుతూ, తాళ్లపాక అన్నమాచార్యులను తొలి వాగ్గేయకారుడిగా అభివర్ణించారు. ఆయన సంకీర్తనలు భక్తిని గాఢం చేసే దివ్య మార్గదర్శకాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చెందిన
డా. అనంత పద్మనాభ రావు “అన్నమయ్య సంకీర్తనల ప్రచారం–ప్రసారం”పై మాట్లాడుతూ, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనల ప్రచారం సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. రేడియో, టీవీ, డిజిటల్ వేదికల ద్వారా ఈ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.
తిరుపతికి చెందిన ఆచార్య దామోదర నాయుడు తాళ్లపాక కవుల పదప్రయోగాల వైశిష్ట్యాన్ని వివరించగా, ఆచార్య చెన్నప్ప అన్నమయ్య కీర్తనల్లో సమానత్వం, మానవత్వం ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు లత తదితరులు పాల్గొన్నారు.

Tags; The literary wealth of Annamayya’s Sankirtanas—an inspiration for generations.