తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.
చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు సురేష్, ముని చెంగల్రాయులు, రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: Sri Padmavathi Ammavaru's Vasanthotsavams Conclude Grandly