May 2, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో ‘హైటెక్’ నిఘా

అన్నమయ్య జిల్లాలో ‘హైటెక్’ నిఘా

May 2, 2026 | Andhra Pradesh

: ఆకాశం నుండి ఆకతాయిలపై డేగ కన్ను!

💠జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో ముమ్మరమైన నిఘా..

👉రంగంలోకి శక్తి బృందాలు.. డ్రోన్ల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన..

మదనపల్లి ముచ్చట్లు:

జిల్లా ప్రజల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ ‘విజిబుల్ పోలీసింగ్’ ను ముమ్మరం చేశారు.

నేర నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను జోడించింది. మదనపల్లి, రాయచోటి పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. నేల మీద పోలీసులు గస్తీ తిరుగుతుంటే, ఆకాశం నుండి డ్రోన్ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయి. దీనివల్ల ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ నుండి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం కలిగింది.

ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ‘శక్తి బృందాలు’ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నాయి. కాలేజీలు, బస్టాండ్లు మరియు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల వద్ద ఈ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే డ్రోన్ విజువల్స్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.

పోలీసుల ఈ హైటెక్ నిఘా పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కళ్లెదుట కనిపిస్తూ, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తుండటంతో సామాన్య ప్రజల్లో భద్రతా భావం పెరిగింది.

“జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే డ్రోన్ నిఘా ద్వారా తప్పించుకోవడం అసాధ్యం. అత్యవసర సమయంలో డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించండి.”

Tags: ‘High-tech’ surveillance in Annamayya district