మదనపల్లె టౌన్ ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ఆకతాయిలపై నిఘా ముమ్మరంచేసి, వారి ఆట కట్టించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ విజిబుల్ పోలీసింగ్ ను ముమ్మరం చేశారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను జోడించింది. మదనపల్లి, రాయచోటి పట్టణాలలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. నేల మీద పోలీసులు గస్తీ తిరుగుతుంటే, ఆకాశం నుండి డ్రోన్ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయన్నారు. దీంతో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ నుండి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. కాలేజీలు, బస్టాండ్లతో పాటు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే డ్రోన్ విజువల్స్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరి రక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే డ్రోన్ నిఘా ద్వారా తప్పించుకోవడం అసాధ్యమన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.
Tags: ‘High-tech’ surveillance on Annamayya district thugs