April 26, 2026
Explore
అధునాతన వసతులతో నూతన మార్కెట్ యార్డ్

అధునాతన వసతులతో నూతన మార్కెట్ యార్డ్

April 26, 2026 | Andhra Pradesh

-భూముల కోసం జేసీ, సబ్ కలెక్టర్ పరిశీలన

మదనపల్లె ముచ్చట్లు:

రైతులు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా, రవాణా వాహనాల‌ సమస్య తీరేలా కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అన్నారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలో కదిరిరోడ్డుపై ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను మరోచోట నిర్మించి తరలించాలన్న ప్రయత్నాలపై ఆదివారం క్షేత్రస్థాయిలో భూముల కోసం పరిశీలన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మార్కెట్ చైర్మన్ శివరాం, మార్కెట్ కార్యదర్శి జగదీష్, రెవెన్యూ సిబ్బంది మదనపల్లె పట్టణ పరిసరాల్లోనే మూడు చోట్ల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఆధునిక వసతులతో, రద్దీకి తగ్గట్టుగా 50 ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ను నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా బైపాస్ రోడ్డులో ఉన్న 30-40 ఎకరాల ప్రభుత్వ భూమి, శానిటోరియం సమీపంలోని మెడికల్ కాలేజీకి దక్షిణ భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న డికెటి సాగు భూములను.
పోతుబోలు రోడ్డులో ఉన్న 40 ఎకరాల భూమిని జేసీ, సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మదనపల్లె టమాట మార్కెట్ కు వచ్చే రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

Tags: New Market Yard with Modern Amenities