గుర్రంకొండ ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. గుర్రంకొండ పట్టణంలోని ఇందిరమ్మ, జగనన్న కాలనీల్లో తెల్లవారుజామున నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ చర్యలు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణ మోహన్ నాయకత్వంలో ఉదయం 4 గంటలకే సుమారు 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కాలనీల్లో తనిఖీలు ప్రారంభించారు. ‘ఈగల్ టీమ్’ డ్రోన్ కెమెరాల ద్వారా గగనతలం నుంచి పర్యవేక్షణ చేపట్టి ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు.
ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు దాదాపు 1350 మంది కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సరైన పత్రాలు లేని 22 బైకులు, 6 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
మాదక ద్రవ్యాలు వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్ వంటి చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి “వజ్రప్రహార్” ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.
Tags: ‘Vajra Prahar’ in Gurramkonda at Dawn: Massive Police Operation