April 24, 2026
Explore
అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?

అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?

April 24, 2026 | Andhra Pradesh

ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా

ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్

తాజాగా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం!

అనంతపురం ముచ్చట్లు:

కలకలం రేపుతున్న అనంతపురంలో హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. అమాయకులను, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

నిందితులతో నరేందర్ రెడ్డి నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కాల్ డేటా, వాయిస్ రికార్డుల ద్వారా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో ‘కింగ్’ గా పిలవబడే రంగమ్మ నాయుడు (చిన్ని నాయుడమ్మ), రాజేశ్ తో పాటు జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారి అనే ముగ్గురు మహిళలను పోలీసులు ఇప్పటికే జైలుకు పంపారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ మొత్తం భాగోతం బట్టబయలైంది.

ఈ ముఠా ఇప్పటివరకు పలువురు ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నరేందర్ రెడ్డి పాత్రపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత, రేపు ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags: YCP Leader Arrested in Anantapur Honey Trap Case?