తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
ఆలయానికి పరదాలు విరాళం :
శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు నాలుగు, తిరుపతికి చెందిన శ్రీ మణి అనే భక్తుడు రెండు పరదాలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ప్రధాన అర్చకులు ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
మార్చి 16న అంకురార్పణ :
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 16వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Tags: Grand 'Koil Alwar Thirumanjanam' Celebrated at the Sri Kodandarama Swamy Temple