April 19, 2026
Explore
ఏపీకి కొత్త రైల్వే లైన్లు… కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ఏపీకి కొత్త రైల్వే లైన్లు… కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

April 19, 2026 | Andhra Pradesh

నిడదవోలు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదంకి

నిడదవోలు-దువ్వాడ మధ్య 3వ, 4వ లైన్లకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని వెల్లడి

గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఆయన ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మించనున్నారని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనివల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని వివరించారు. ఈ కొత్త లైన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

అంతేకాకుండా, అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags: New Railway Lines for AP… CM Chandrababu Thanks the Centre