తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర గురువారం ఆవిష్కరించారు. టిటిడి నివాస గృహంలోని ఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 16న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అలాగే, మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఈవో కోరారు.
అంతకుముందు ఆలయ అర్చకులు టిటిడి ఈవో కు వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ సిబ్బంది , అర్చకులు పాల్గొన్నారు.
Tags: TTD EO unveils booklet of Sri Kodandaramaswamy Brahmotsavam