April 14, 2026
Explore
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

April 14, 2026 | Andhra Pradesh

రూ. 20 లక్షల విలువ గల 10 ఎర్రచందనం దుంగలు, స్వాధీనం

శేషాచలం ముచ్చట్లు:

శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు, రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF), తిరుపతి హెడ్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, IPS ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం నిర్వహించబడుతున్నాయి.ఈ క్రమంలో, టాస్క్ ఫోర్స్ బృందానికి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, 14.04.2026 తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా, టీ. సుండుపల్లి మండలం, పించా ప్రాజెక్ట్ సమీప అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌తో నిలబడి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుండి 10 ఎర్రచందనం దుంగలు చేసుకున్నారు.

అరెస్టు చేసిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూర్ జిల్లా, అంబూర్ తాలూకా, ఎరుపారి గ్రామం, నాయకనేరి పంచాయతీకి చెందిన రామకృష్ణ (వయస్సు: 26 సంవత్సరాలు, తండ్రి: ముత్తు)గా గుర్తించారు.

విచారణలో భాగంగా, సదరు నిందితుడు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో కలిసి ముఠాగా ఏర్పడి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలను శేషాచలం అటవీ ప్రాంతాలకు పంపించి, ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికించి, తమిళనాడు మార్గం ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నట్లు బయటపడింది.సదరు నిందితుడు తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో నమోదైన మొత్తం 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఇటీవల ఫిబ్రవరి నెలలో పించ సమీపంలో ట్యాంకర్‌లో తరలిస్తున్న 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసిన కేసులో కూడా ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఈ కేసులో మిగతా ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. అదనంగా, నిందితునిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి, అతని ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసును విజయవంతంగా ఛేదించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని RSASTF హెడ్ ఎల్. సుబ్బరాయుడు, IPS అభినందించారు.

Tags:Inter-state Red Sandalwood Smuggler Arrested