April 13, 2026
Explore
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

April 13, 2026 | Andhra Pradesh

.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ ఉన్నత స్థాయి శిక్షణ కోసం మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు సింగపూర్‌కు వెళ్లనున్నారు. తమ శాఖలకు సంబంధించిన ప్రపంచ స్థాయి విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఏపీలో అమలు చేసే అవకాశాలను వీరు పరిశీలించనున్నారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సింగపూర్ అనుసరిస్తున్న విజయవంతమైన నమూనాలపై దృష్టి సారించనున్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అవినీతిరహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్‌ను ఎంపిక చేసింది. ఈ శిక్షణ ద్వారా మంత్రులు నేర్చుకున్న అనుభవం, పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరిగి ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా తీసుకున్న మరో ముఖ్యమైన ముందడుగుగా దీనిని విశ్లేషిస్తున్నారు.

Tags: CM Chandrababu important decision