అదనపు ఎస్పీ వెంకటాద్రి . –
మదనపల్లి ముచ్చట్లు:
సామాజిక చీకట్లను చీల్చుతూ అక్షర జ్యోతులను వెలిగించిన మహా మనీషి, మహాత్మ జ్యోతిబా పూలే ఆదర్శాలు నేటి సమాజానికి దిక్సూచి అని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి కొనియాడారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, పూలే చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…. అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలు రాజ్యమేలుతున్న కాలంలో.. కేవలం విద్యతోనే విముక్తి సాధ్యమని నమ్మిన ధీశాలి పూలే అని ప్రశంసించారు. 1848లోనే తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలిని చేసి, బాలికల కోసం పాఠశాల స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన కృషి భారత చరిత్రలో చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, 1 వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఆర్.ఎస్.ఐలు అమరనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొని అంజలి ఘటించారు.
Tags: A Warrior of the Written Word… A Social Revolutionary: Jyotiba Phule