ఖమ్మం ముచ్చట్లు:
దొంగలు పడితే బంగారం దోచుకుంటారు.. మహా అయితే నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ చోరీ స్టైలే వేరు.. దొంగలు బీరువాలోని నగలను దోచుకోవడమే కాకుండా వంటింట్లోకి వెళ్లి కందిపప్పు, ఉల్లిగడ్డలు, చివరకు గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా తీసుకెళ్లారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటనలో అసలు ఏం జరిగిందంటే..?
ఖమ్మం జిల్లాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీ స్కెచ్తో చోరీకి పాల్పడ్డారు. అయితే వీరు కేవలం నగలు, నగదు మాత్రమే కాకుండా.. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులను కూడా వదలకుండా ఎత్తుకెళ్లడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో హైవే పక్కనే ఉన్న మసీదులో కమాలుద్దీన్ అనే వ్యక్తి మౌజమ్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్యతో కలిసి మసీదు ఆవరణలోనే నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దంపతులిద్దరూ బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు, ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.
బీరువా ఖాళీ.. కిచెన్ కూడా క్లీన్
దొంగలు ముందుగా బీరువాను పగులగొట్టి అందులో దాచుకున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు, వెండి వస్తువులను అపహరించారు. అయితే అంతటితో ఆగని దొంగలు వంటగదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె చివరకు గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు, చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను చూసి షాక్కు గురయ్యారు. నగలతో పాటు వంటింట్లో ఉన్న నిత్యావసరాలను కూడా దొంగలు తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపోవడం బాధితుల వంతైంది.
కేసు నమోదు – దర్యాప్తు
బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెనుబల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే, అది కూడా హైవే పక్కనే ఉన్న ఇంట్లో ఇలాంటి విచిత్ర చోరీ జరగడంతో లంకపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Tags;You’ll be left open-mouthed if you find out what these thieves made off with.