రష్యా ముచ్చట్లు:
ర ష్యా- ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలూ పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. మధ్యవర్తిత్వంతో సహా ఇతర సహాయానికి కూడా భారత్ రెడీ అని తెలిపారు. ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి కుదరడమే ప్రాధాన్యం అని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు, మధ్యవర్తిత్వం, దౌత్య పరమైన చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కీవ్ పర్యటనలో భాగంగా అనేక అంశాలపై ఆయన ఉక్రెయిన్ అధికారులతో చర్చలు జరిపారు.
ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా నేతృత్వంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో యుద్ధంతో ఏమీ రాదని.. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని జై శంకర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఇలాగే యుద్ధం కొనసాగితే ప్రజల ప్రాణాలు, విధ్వంసం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇక ఇటీవల కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో జరిగిన షాంగై కో ఆపరేషన్ సదస్సు (SCO) లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్ మధ్య నిరంతరాయంగా జరుగుతున్న యుద్ధానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జై శంకర్.. ప్రధాని మోదీ మాటలను గుర్తు చేశారు. యుద్ధం వల్ల ప్రాణాలు పోవడం, విధ్వంసం తప్పితే ఏమీ మిగలదని స్పష్టం చేశారు.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ యుద్ధాన్ని ఆపేందుకు తాము ఎంతకైనా సిద్ధంగానే ఉంటామని.. మధ్యవర్తిత్వం చేయడంతోపాటు ఇతర సాయానికి భారత్ రెడీగా ఉంటుందని జై శంకర్ పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్- రష్యా మధ్య దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఈ మేరకు నౌకలపైన జరిగిన దాడుల్లో భారత్ కు చెందిన నావికులు మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. కమర్షియల్ షిప్పింగ్ పై ఇలాంటి దాడుల ప్రభావం అధికంగా ఉందని.. దానివల్ల గ్లోబల్ సౌత్ దేశాల్లో చమురు, ఫెర్టిలైజర్లు, ఫుడ్ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ఉక్రెయిన్ అధికార యంత్రాంగంతో మాట్లాడానని వివరించారు.
మరోవైపు రష్యాతో యుద్ధం మొదలైన దగ్గరినుంచి ఉక్రెయిన్ కు భారత్ మానవతాసాయం అందిస్తూనే ఉందని జై శంకర్ తెలిపారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ కు 19 కన్ సైన్మెంట్ ల మానవతాసాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్- భారత్ మధ్య అనేక రంగాల్లో వాణిజ్య సంబంధాలు మరింత బలపడ్డాయని తెలిపారు.
ఇరు దేశాల మధ్య ఫార్మా, వ్యవసాయం, ఎరువులు, మెషినరీ, కెమికల్, కన్జూమర్ గూడ్స్ తదితర రంగాల్లో సంబంధాలు ఉన్నాయని వివరించారు. ఇక విదేశీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఉక్రెయిన్, పోలాండ్ లో జై శంకర్ పర్యటించనున్నారు.
Tags: Russia-Ukraine War: India ready for mediation – Jaishankar