హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రేవంత్రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే, యూకే పర్యటనకు మాత్రమే విదేశాంగశాఖ అనుమతించింది. అమెరికా పర్యటనకు అనుమతివ్వలేదు.
దిగ్భ్రాంతికి గురిచేసింది: సీఎం రేవంత్రెడ్డి
యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ‘‘ కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయటమే నా లక్ష్యం. తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలు తీసుకురావడమే నా లక్ష్యం. ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావటమే పర్యటన ఏకైక ఉద్దేశం. నా విదేశీ పర్యటన వికసిత్ భారత్కు దోహదపడుతుందని భావించా. దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతాను’’ అని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు.. అమెరికా పర్యటన కొనసాగించాలని అధికారుల బృందానికి సీఎం ఆదేశించారు. అన్ని ఎంవోయూలు యథాతథంగా చేసుకోవాలని, వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
లండన్ పర్యటనలో సీఎం..
రెండ్రోజుల క్రితం దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన ముఖ్యమంత్రి .. అక్కడి నుంచి నేరుగా లండన్ చేరుకున్నారు. ఇవాళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను, సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శిస్తారు. ఆగస్టు 23న సీఎం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరతారు.
Tags: Centre denies permission for CM Revanth Reddy’s US visit.