August 21, 2026
Explore
16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలి

16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలి

August 21, 2026 | Andhra Pradesh

– ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న 16% హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా కొనసాగించాలని రాయచోటి నియోజకవర్గ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఇటీవల అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చిన నేపథ్యంలో, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు అమలవుతున్న 16% హెచ్‌ఆర్‌ఏను తొలగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఇప్పటికే జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన రాయచోటి ఉద్యోగులు 16% హెచ్‌ఆర్‌ఏను కూడా కోల్పోతే ఆర్థికంగా మరింత నష్టపోవడంతో పాటు, ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంటుందని ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం G.O.Ms.No.69 జారీ చేసి, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% హెచ్‌ఆర్‌ఏను మంజూరు చేసిందని వారు గుర్తుచేశారు. ఈ హెచ్‌ఆర్‌ఏను కేవలం జిల్లా కేంద్రం హోదాతో ముడిపెట్టకుండా, రాయచోటి గ్రేడ్‌-1 మున్సిపాలిటీకి ప్రత్యేకంగా యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు.

ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై సానుకూల దృక్పథంతో, సహృదయంతో స్పందించి, రాయచోటి ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ 16% హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని ఐక్యవేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు.

అనంతరం రాయచోటి నియోజకవర్గ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు.

ఐక్యవేదిక గౌరవ సలహాదారుగా కొండూరు శ్రీనివాసరాజు, కన్వీనర్‌గా షేక్ జాబీర్, కో-కన్వీనర్లుగా అబ్బవరం హరిబాబు, అంకం శివారెడ్డి, మడితాటి నరసింహారెడ్డి, మడితాటి వేణుగోపాల్ రెడ్డి, సుంకర రామక్రిష్ణ,కార్యదర్శులుగా పల్లం రామచంద్ర, వల్లూరి ఇలియాస్ భాష, ఎన్. రామాంజులు, ఎస్. జఫ్ఫారుద్దీన్, పి. సిద్దయ్య, పి. రెడ్డప్ప రెడ్డి, పి. గఫార్ ఖాన్ తదితరులను ఎన్నుకున్నారు.

16% హెచ్‌ఆర్‌ఏను కొనసాగించే వరకు దశలవారీగా ఉద్యమ కార్యక్రమాలను చేపడతామని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు.

Tags: 16% HRA should be continued as is.