అమరావతిముచ్చట్లు:
డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ
హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని వెల్లడి
ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందవద్దని స్పష్టీకరణ
అక్టోబర్లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్.. డిసెంబర్లో పరీక్షలు
మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేదని, హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనలను పక్కాగా అమలు చేశామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ, అక్టోబర్లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది.
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ ఎంపికపై ఇప్పటికే మూడుసార్లు వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే మరోసారి స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, కేవలం అర్హులైన అభ్యర్థులకే పోస్టులు దక్కాయని ఆయన నొక్కిచెప్పారు.
“డీఎస్సీ నిర్వహణలో 12 రకాల ప్రమాణాలను అనుసరించాం. ఎంపికైన వారి మెరిట్, సెలక్షన్ జాబితాలను ఆన్లైన్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుంది. ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే నేరుగా అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు,” అని కమిషనర్ వివరించారు.
ఉద్యోగాలు రాని అభ్యర్థులు వదంతులను నమ్మి నిరుత్సాహపడకుండా, రాబోయే డీఎస్సీపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని తమీమ్ అన్సారియా వెల్లడించారు.
Tags: Education Department Commissioner Tamim Ansariya provides further clarity on AP DSC.