సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక.
మదనపల్లె ముచ్చట్లు:
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
స్థానిక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిశా ఆధ్వర్యంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ కేంద్రాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) ప్రతినిధులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ..జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశాల మేరకు రెండు నెలలపాటు హైరిస్క్ గ్రామాలు, కళాశాలలు మరియు ఇతర ప్రాంతాల్లో ఎయిడ్స్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐసీటీసీ సిబ్బంది, ఎన్జీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
మిషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ చర్యలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరా తదితర సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన హెచ్ఐవీ పరీక్షలు, వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిశా ప్రివెన్షన్ అధికారి ఆనంద్, కౌన్సిలర్లు జయకుమార్, చంద్ర, ఎన్జీఓ ప్రతినిధులు అలావల్లి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Tags: AIDS awareness programs in the district from the 12th.