పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా, గురజాల: కారంపూడి ఎస్సై వేధింపుల కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో గురజాల డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మహేశ్వరరావు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అయ్యప్ప అనే వ్యక్తి దాదాపు 40 మంది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయించాడని తెలిపారు. రైతులకు సుమారు రూ.1.5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క రైతుకూ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే అయ్యప్పపై చీటింగ్ కేసు నమోదు చేశామని, అనంతరం అతను కోర్టు నుంచి బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగానే కారంపూడి ఎస్సై విచారణ నిమిత్తం అతడిని పోలీస్ స్టేషన్కు పిలిచారని వెల్లడించారు.
రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే విచారణ చేపట్టామని, ఆ సమయంలో అయ్యప్ప భార్య లక్ష్మి కూడా స్టేషన్కు వచ్చిందని డీఎస్పీ వివరించారు. అనంతరం ఆమె పురుగుల మందు తాగి పిడుగురాళ్ల ఆస్పత్రిలో చేరిందని, కారంపూడి ఎస్సై వల్లే తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పారు.
ఆ వీడియోలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోందని, విచారణలో ఎస్సై తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. పోలీసుల ఉద్దేశం రైతులకు న్యాయం చేయడమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో చిన్నకొదమగుల్ల, పెద్దకొదమగుల్ల, బట్టువారిపాలెం తదితర గ్రామాలకు చెందిన దాదాపు 40 మంది రైతులు బాధితులుగా ఉన్నారని డీఎస్పీ తెలిపారు.
Tags: Allegations of harassment against Karampudi SI… DSP’s clarification.