August 1, 2026
Explore
దొంగతనం కేసులను ఛేదించిన తిరుమల పోలీసులు.

దొంగతనం కేసులను ఛేదించిన తిరుమల పోలీసులు.

August 1, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఒక నిందితుడు అరెస్ట్ – ఒక చట్టంతో ఘర్షణ పడిన బాలుడు అదుపులో.
  • సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, నగదు స్వాధీనం.
  • త్వరితగతిన కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుమలలో ఇటీవల జరిగిన గొలుసు అపహరణ మరియు గృహ చోరీ ఘటనలను తిరుమల పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసుల్లో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు ఒక చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని (Child in Conflict with Law) జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.7,00,000 (ఏడు లక్షలు) విలువైన బంగారు నగలు, ఒక గిల్ట్ చైన్ మరియు రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుమల ఎస్‌డీపీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలలో నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఇటీవల తిరుమలలో జరిగిన గొలుసు అపహరణ మరియు గృహ చోరీ ఘటనలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

దర్యాప్తులో తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఎన్. సురేష్ కుమార్ (25)ను అరెస్ట్ చేయగా, విజయనగరం జిల్లా, బొబ్బిలికి చెందిన 16 సంవత్సరాల చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును పంచనామా ద్వారా స్వాధీనం చేసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.దర్యాప్తులో నిందితుడు ఎన్. సురేష్ కుమార్ గతంలో కూడా పలు నేర కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

ఈ కేసుల ఛేదనలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అందించిన కీలక సమాచారం నిందితులను గుర్తించి పట్టుకోవడంలో ఎంతో దోహదపడిందని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ సీవీ అండ్ ఎస్‌వో మురళీకృష్ణ మాట్లాడుతూ, తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వెంట తీసుకువచ్చే నగదు, బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు.కేసులను అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేసిన తిరుమల పోలీసు సిబ్బంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది మరియు టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Tags: Tirumala police solved theft cases.