గుంటూరు ముచ్చట్లు:
గోల్డ్ కంపెనీల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఐదుగురిపై రెండు చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన దామర్ల భాను ప్రకాష్ స్థానికంగా లక్ష్మీవినాయక గోల్డ్ ట్రేడర్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు.
తిరుపతికి చెందిన కొండపల్లె శివసాయి కొన్ని రోజులుగా వి.వి.మహల్ రోడ్లలోని సుజనా గోల్డ్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తామని గోల్డ్ కంపెనీలు సోషల్ మీడియాలో చేసిన ప్రకటన చూసి వాల్మీకిపురానికి చెందిన నవీన్కుమార్ వారిని ఆశ్రయించాడు.
మదనపల్లెలోని శ్రీమహాలక్ష్మీ పాన్బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరాడు. దాంతో భానుప్రకాష్, శివసాయి ఇటీవలే డబ్బు తీసుకుని మదనపల్లెకు వచ్చారు. పథకం ప్రకారం నవీన్, అతని స్నేహితులు వాసు, చరణ్, శబరీష్, స్వరూప్ వారిని తీసుకుని పాన్బ్రోకర్ వద్దకెళ్లారు. డబ్బు ఇస్తే బంగారాన్ని విడిపించుకుని వస్తామని నమ్మబలికి భానుప్రకాష్ వద్ద రూ.2.16 లక్షలు, శివసాయి వద్ద రూ.1.50లక్షలు తీసుకున్నారు.
అనంతరం వారిని ఏమార్చి అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు చీటింగ్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Tags:Cheating case against five people