March 25, 2026
Explore
నియోజకవర్గాల పునర్విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నియోజకవర్గాల పునర్విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

March 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన శాసనసభాపక్ష (జేఎల్‌పీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో జరిగిన పునర్విభజన అనుభవాలను గుర్తుంచుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గణనీయంగా పెరుగుతాయని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 50 శాతం పెంచడాన్ని స్వాగతించారు. దీనివల్ల రాష్ట్రంలో 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ స్థానాలు పెరిగి, దాదాపు 100 మందికి కొత్తగా రాజకీయ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, సహేతుకంగా జరగాలని, ఎక్కడా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కిచెప్పారు.

ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువగా ఉంటూ దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. డీలిమిటేషన్‌పై పార్టీ కార్యాచరణను ఖరారు చేసేందుకుగాను, ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు పవన్ సూచించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పార్టీ తన తుది వైఖరిని నిర్ణయిస్తుందని తెలిపారు.

Tags: Constituency Delimitation: Pawan Kalyan Makes Interesting Remarks During Meeting with Janasena MLAs