మచిలీపట్నం ముచ్చట్లు:
మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం
కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో క్షణికావేశం ఒక కుటుంబంలో విషాదం నింపింది. కుమారుడిపై కోపంతో కర్రతో దాడి చేసిన తండ్రి కొడుకు ప్రాణాలు పోయాయి.
పోలీసుల వివరాల ప్రకారం… బొట్లవానిపాలెంకు చెందిన రామ్మోహన్ రావు ఇంట్లో ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తి(30)తో తల్లికి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీన్ని సర్దిచెప్పే క్రమంలో రామ్మోహన్ రావు క్షణికావేశానికి గురయ్యారు. ఆవేశంలో కుమారుడు కళ్యాణ చక్రవర్తిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు.
దాడిలో కళ్యాణ చక్రవర్తికి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో బొట్లవానిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags: Father beats son to death with a stick in a fit of rage…