అదుపుతప్పి పల్టీలు కొట్టిన విద్యార్థుల కారు.
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన తీరు..
చిలకలూరిపేట నుంచి కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా, గణపవరం సమీపంలోని కృష్ణగంగ స్పిన్నింగ్ మిల్ వద్దకు రాగానే ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి,రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది.వేగం ఎక్కువగా ఉండటంతో కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది.
సకాలంలో స్పందించిన స్థానికులు..
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయిన కారులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Horrific road accident near Ganapavaram…