రాయచోటి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసి జూలై 31లోపు విద్యార్థుల నమోదు పూర్తి చేయాలని జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి సూచించారు.
రాయచోటి డైట్లోని జిల్లా స్కౌట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో కబ్–బుల్బుల్, ఉన్నత పాఠశాలల్లో స్కౌట్–గైడ్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రోవర్–రేంజర్ యూనిట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. స్కౌటింగ్ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.27 ప్రకారం శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, మెడికల్ తదితర విద్యా ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమల్లో ఉన్న నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో విద్యార్థులను నమోదు చేయాలని కోరారు.
Tags: A Scout unit must be established in every school: District Secretary