అమరావతిముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. గరికపాటి అక్కసుతో మాట్లాడినట్లుందని, ఆయన స్థాయికి ఇది తగదని హితవు పలికారు. సమాజానికి ఉపయోగపడాల్సిన మేధస్సుతో పేద పిల్లలను అవహేళన చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గరికపాటి మాట్లాడుతూ.. పిల్లలకు విద్య అందిస్తే సరిపోతుందని, భోజనం అవసరం లేదని అన్నారు. “పిల్లలు కొత్త పెళ్లికొడుకుల్లా స్కూళ్లకు వచ్చి గుడ్డు కోసం పోరాడుతున్నారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై గరికపాటి బృందం వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు.
ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. గరికపాటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. “ప్రభుత్వ బడుల్లో చదివేది అత్యంత నిరుపేద, సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలే. ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు? కడుపు మండుతుంటే టీచర్ చెప్పే పాఠాలు వాళ్ల బుర్రకెక్కుతాయా?” అని నాగేశ్వర్ ప్రశ్నించారు. గరికపాటి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడి పిల్లల బాధను అర్థం చేసుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, వారి అభ్యసన సామర్థ్యం (లెర్నింగ్ కెపాసిటీ) గణనీయంగా పెరిగాయని నివేదికలే చెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు. గరికపాటి కూడా లెక్చరర్గా పనిచేసిన విద్యావేత్తేనని, ఈ వాస్తవాలను గమనించాలని కోరారు. “అన్నదానాన్ని మించిన దానం లేదని మన ధర్మశాస్త్రాలు చెబుతుంటే, ప్రభుత్వం పేద పిల్లలకు అన్నం పెట్టడాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం? కన్నీళ్లతో, చేతులు జోడించి అడుగుతున్నా.. దయచేసి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు.
Tags:Professor Nageshwar Lashes Out at Garikapati’s Remarks; Expresses Outrage, Alleging He Spoke Out of Spite