5 మంది పిల్లలు పైన ఉంటే నమోదుకు బ్రేక్
- తల్లి, తండ్రి పేర్లు సరిగాలేదంటే క్లోజ్
- వార్డుకు 100 నుంచి 150 ఓట్లు ఔట్
పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటర్లకు తలనొప్పిగా మారుతోంది. 2002 ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రుల జాబిత, లేదా కుటుంబ సభ్యుల జాబితాలో మ్యాపింగ్ చేసుకోవాలి. కానీ మున్సిపాలిటి పరిధిలోని 36 వార్డులలోను విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఓట్లు డిజిటల్ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు కుటుంబంలో తల్లిదండ్రులకు 7 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలను మాత్రమే పరిగణలోనికి తీసుకుని డిజిటల్ నమోదు జరుగుతోంది. ఈ సమయంలో బేబిమిస్మ్యాచ్ అవుతోంది. మిగిలిన పిల్లల సంగతేంటి..? అలాగే ఫకృద్ధిన్షరీఫ్ అనే పేరుకు బదులుగా గతంలో పకృద్ధిన్షరీఫ్గా పడింది. ఇలాంటి వాటిని డిజిటల్లో తీసుకోవడం లేదు. అలాగే ఉదాహరణకు తల్లిదండ్రుల పేర్లు తప్పుగా ఉన్న డిజిటల్లో తీసుకోవడం లేదు. అలాగే గతంలో పెద్దలు తమ పిల్లలకు ఏదో ఒక పుట్టినతేదీ వేసి నమోదు చేశారు. ప్రస్తుతం ఇలాంటి వారికి పుట్టినతేదీలు లేకపోవడం, పిల్లలకు తగిన దూరం లేకపోవడంతో డిజిటల్లో నమోదు కావడం లేదు. పట్టణంలోని రహమత్నగర్, ఉబేదుల్లాకాంపౌండులో మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మైనార్టీ నాయకులు మహబూబ్బాషా, సాజిదాబేగం, కాపు సంఘ కార్యదర్శి కొండవీటి నరేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి నమోదు చేపట్టారు. ఈ సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఈ విధంగా ఒకొక్క వార్డులో 100 నుంచి 150 ఓటర్లు గల్లంతైయ్యే అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, ఇలాంటి సమస్యలను పరిష్కరించి, ప్రతి ఓటరు డిజిటల్ నమోదు సులభంగా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags: Mismatches in ‘Sir’ / ‘Baby’