– NCB మరియు ఈగల్ (EAGLE) వింగ్ సంయుక్త చర్య
అనకాపల్లి ముచ్చట్లు:
మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), రాష్ట్ర ప్రభుత్వ ‘ఈగల్’ (EAGLE) వింగ్ సంయుక్తంగా భారీ స్థాయిలో గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు వేర్వేరు కేసుల్లో NCB అధికారులు స్వాధీనం చేసుకున్న సుమారు 767.5 కిలోల గంజాయిని, 4.036 లీటర్ల హషీష్ ఆయిల్ను శుక్రవారం నాడు శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేశారు.
పరవాడ మండలం, తానం గ్రామంలోని ‘రామ్కీ ఫార్మా’ కంపెనీకి చెందిన అత్యాధునిక ఇన్సినరేషన్ (Incineration) ప్లాంట్లో కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ, బహిరంగంగా కాల్చకుండా మెషీన్ ద్వారా ఈ డ్రగ్స్ను నిర్వీర్యం చేశారు.
ఈగల్ ఎస్పీ జి.స్వరూప రాణి, NCB జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ ద్వివేదిల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ముగిసింది. ఈ కార్యక్రమంలో NCB సూపరింటెండెంట్ రాజన్ కుమార్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కె.కిరణ్ బాబు, ఈగల్ విభాగం ఇన్స్పెక్టర్లు జి.దేముళ్ళు, డాక్టర్ కల్యాణి మరియు అనకాపల్లి ఈగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.
అధికారుల హెచ్చరిక:
“యువతను వ్యసనాల బారి నుండి కాపాడేందుకు, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు, నిర్మూలన చర్యలు నిరంతరం కొనసాగుతాయి. పట్టుబడిన మత్తు పదార్థాలను ఎప్పటికప్పుడు కోర్టు అనుమతితో ఇలాగే ధ్వంసం చేస్తాం” అని అధికారులు స్పష్టం చేశారు.
Tags:767 kg of Ganja and Hashish Oil incinerated at Ramky Pharma City.