సైబర్ నేరాల నుంచి రక్షణకు జాగ్రత్తలు వివరించిన పోలీసులు.
- రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై చైతన్య సదస్సులు.
- చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచనలు.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు.ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామసభలు, విద్యాసంస్థలు మరియు వివిధ ప్రజా వేదికల ద్వారా ప్రజలు, విద్యార్థులు మరియు యువతకు సమాజ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగానాయుడుపేట AP SWRS లోని ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గంజా, ఇతర మత్తు పదార్థాల వాడకం ఆరోగ్యం, విద్యా భవిష్యత్తు మరియు కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు.
అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, గుర్తు తెలియని లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు మరియు సోషల్ మీడియా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు వివరించారు.
రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యువత రహదారులపై బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు.
ఇంకా మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు మహిళలపై జరిగే నేరాల విషయంలో చట్టపరమైన రక్షణల గురించి ప్రజలకు వివరించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులు, యువత మరియు గ్రామస్థులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని, మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాలు మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
Tags: Creating awareness among students about drug abuse.