July 5, 2026
Explore
దారి తప్పిన ఏనుగుల బీభత్సం.. మామిడి తోటలు, పంటలకు భారీ నష్టం.

దారి తప్పిన ఏనుగుల బీభత్సం.. మామిడి తోటలు, పంటలకు భారీ నష్టం.

July 5, 2026 | Andhra Pradesh

కె.వి.పల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి మండలంలోని జిల్లెల్లమంద పంచాయతీ పరిధిలో దారి తప్పిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పెద్ద తాండ, బసన్నగారిపల్లి, గజ్జలగుట్ట తాండ, కన్నెమడుగు ప్రాంతాల్లో సంచరించిన ఏనుగులు రైతుల మామిడి తోటలు, వరి పొలాల్లోకి చొరబడి తీవ్ర నష్టం కలిగించాయి.స్థానికుల కథనం ప్రకారం, ఏనుగులు మామిడి చెట్లను విరగొట్టడంతో పాటు టెంకాయ చెట్లను నేలకూల్చాయి. పొలాలకు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను ధ్వంసం చేసి, నీటి సరఫరా కోసం వేసిన పైపులను తొక్కేయడంతో అవి విరిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఘటన మరింత నష్టాన్ని మిగిల్చిందని బాధిత రైతులు వాపోతున్నారు.


ఏనుగుల సంచారం కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా జంకుతున్నామని, ఏనుగులు ఇంకా సమీప అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయనే భయంతో అప్రమత్తంగా ఉన్నామని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు సేకరించి, పంటలు, తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి మళ్లించే చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, దారి తప్పిన ఈ గుంపులో సుమారు ఆరు నుంచి ఎనిమిది ఏనుగులు ఉన్నట్లు భావిస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. రైతులకు జరిగిన నష్టంపై ప్రభుత్వం తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Tags: Rampage by straying elephants… massive damage to mango orchards and crops.