-ఎస్ఐ కేసు కట్టలేదని ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ ముచ్చట్లు:
ఇంటి స్థలం కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు దాడి చేసినా ఎస్ఐ కేసు నమోదు చేయలేదంటూ బాధితురాలు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది. సోమవారం మదనపల్లెలో జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం రామాపురంకు చెందిన పత్తిరంగమ్మ ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. వారసత్వంగా సంక్రమించిన ఇంటి స్థలాన్ని అదే రికికి చెందిన ఉమా, సుబ్బయ్య కబ్జా చేయడంతో అడ్డుకున్నానని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ప్రత్యర్థులు దాడి చేసి పళ్లు విరగ్గొట్టి రక్తం కారేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై కేసు పెట్టినా ఎస్ఐ కేసు కట్టలేదని, ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించింది. తరుగు పవన్, విజయలక్ష్మి రాజకీయ నాయకుల అండతో తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని పత్తిరంగమ్మ వాపోయింది. ప్రాణహాని ఉందని ఆమె తెలిపింది. జిల్లా ఎస్పీ ధీరజ్ వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కోరారు.
Tags: Assault for preventing encroachment of house plot; complaint lodged with SP alleging SI failed to register a case.