June 20, 2026
Explore
బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు

బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు

June 20, 2026 | Andhra Pradesh

-ఈ నెల 25 నుంచి అమలు

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక.. నియామకాలు, ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లకు బ్రేకులు పడనున్నాయి. గతేడాది డిసెంబర్ 15 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో కొత్త స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు..

అందుకే ప్రభుత్వం నియామకాలు, బదిలీలు, పదోన్నతులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఫ్రీజింగ్‌ నిబంధనలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలనశాఖ మెమో జారీ చేసింది. ఈ ఫ్రీజింగ్ ఆంక్షలు కొత్త కేడర్లలో సిబ్బంది కేటాయింపులు పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 25 నుంచి అమలులోకి వచ్చే ఈ ఫ్రీజింగ్‌ కాలంలో కొత్త పోస్టులు సృష్టి, ఉన్న పోస్టుల అప్‌గ్రేడేషన్, రద్దు, పోస్టులకు సంబంధించిన మార్పులపై నిషేధం ఉంటుంది. అలాగే ఏపీ ప్రభుత్వం కార్యదర్శులు, శాఖాధిపతులను కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అన్ని కీలక ప్రక్రియలను ఫ్రీజింగ్‌ అమల్లోకి వచ్చేలోపు పూర్తి చేయాలని సూచించింది. ‘ఇప్పటికే సెలెక్షన్‌ పోస్టులకు సంబంధించి డీపీసీ ప్రక్రియ పూర్తి చేయడం.. ఇప్పటికే ఆమోదం పొంది, ఆర్థిక శాఖ అనుమతి పొంది ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రమోషన్లకు ఆదేశాలివ్వడం.. నిబంధనల ప్రకారం అవసరమైన బదిలీలు, డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్ నీట్‌ నోడల్‌ అధికారిగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ భరత్‌గుప్తా నియమితులయ్యారు. నీట్‌ యూజీ-2026 నిర్వహణలో సమన్వయం, పర్యవేక్షణకు సంబంధించిన రాష్ట్ర నోడల్‌ అధికారి బాధ్యతల్ని భరత్ గుప్తాకు అప్పగించారు. కోఆర్డినేషన్ ఆఫీసర్లుగా 16 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను, 28 మంది ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు/హెచ్‌వోడీలను నియమించారు. అలాగే మంగళగిరిలోని ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో నీట్‌ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ శాఖ కార్యదర్శిగా డా.హనుమంతు పురుషోత్తం (నాన్‌ క్యాడర్‌ డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌)ను నియమించింది. పురషోత్తం మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు.

కేంద్రం గ్రామ పంచాయతీలకు సమర్థమైన మానవ వనరుల (హెచ్‌ఆర్‌) వ్యవస్థ ఏర్పాటుకు జాతీయ స్థాయి కమిటీని నియమించింది. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్‌ భరద్వాజ్‌ ఛైర్మన్‌గా నియమించగా.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎంవీఆర్‌ కృష్ణతేజకు ఈ కమిటీలో స్థానం దక్కింది. ఈ కమిటీలో ఛైర్మన్‌తోపాటు కన్వీనర్, ఏడుగురు సభ్యులు ఉన్నారు.. వీరంతా దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సిబ్బంది వ్యవస్థను అధ్యయనం చేయనున్నారు.

Tags: Key orders regarding transfers and promotions