తెలంగాణ ముచ్చట్లు:
భూపరిపాలన శాఖ అధికారి నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆకస్మిక దాడులు
రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడి
అధికారి నరహరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
తెలంగాణ భూపరిపాలన, సర్వే విభాగంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే శాఖ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్తో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరి నివాసం, నారాయణగూడలోని ఆయన కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో నరహరి ఇంట్లోని బెడ్రూమ్లో ఉన్న బీరువా పైభాగంలో దాచిన రూ.1.54 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు ఒక కిలో బంగారం, పలు కీలక ఆస్తి పత్రాలను కూడా సీజ్ చేశారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, బహిరంగ మార్కెట్ విలువ అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కోటి రూపాయలకు పైగా విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశారు.
Tags; Bundles of cash found at Survey Department official’s home; Rs 1.54 crore in cash and one kilogram of gold seized in ACB raids.