అన్నమయ్య జిల్లాముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మీ-సేవ కేంద్రాలు స్టేషనరీ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజలకు సర్టిఫికెట్లు ప్రింట్ తీసి అందించేందుకు అవసరమైన ప్రత్యేక స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని కేంద్రాల సేవలు స్తంభించిపోయాయి.
సంస్థ నిబంధనల ప్రకారం నిర్వాహకులు కోరిన పత్రాలు సమర్పించిన తర్వాతే యూజర్ ఐడీ లాగిన్లు మంజూరు చేస్తారు. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి పాత స్టేషనరీని వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కొత్త స్టేషనరీని సరఫరా చేయలేదు.
సీఎంఎస్ (CMS) వ్యవస్థకు మారిన తర్వాత ఒక్కో కేంద్రం వెయ్యి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా నెలరోజులు గడిచినా స్టేషనరీ అందలేదని నిర్వాహకులు వాపోతున్నారు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు రాకపోవడంతో పాటు చెల్లించిన మొత్తాలు కూడా ఖాతాలకు తిరిగి జమ కావడం లేదని చెబుతున్నారు.
తర్వాత పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సీఎంఎస్ ప్రతినిధులు సూచించడంతో నిర్వాహకులు మళ్లీ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. స్టేషనరీ సరఫరాలో జాప్యం కారణంగా మీ-సేవ కేంద్రాల నిర్వహణతో పాటు ప్రజలకు సేవలందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Shortage of stationery at Mee-Seva centers; difficulties for operators and customers.