June 12, 2026
Explore
భార్య, కొడుకు గొంతునులిమేసి సూసైడ్ చేసుకున్న వ్యాపారి!….

భార్య, కొడుకు గొంతునులిమేసి సూసైడ్ చేసుకున్న వ్యాపారి!….

June 12, 2026 | Andhra Pradesh

ఫ్రీ బస్సే మా చావులకు కారణం.. భార్య, కొడుకు గొంతునులిమేసి సూసైడ్ చేసుకున్న వ్యాపారి!….

కర్ణాటక ముచ్చట్లు:

కర్ణాటక రాష్ట్రంలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకం ఆ కుటుంబాన్నే చిదిమేసింది. చిన్న వ్యాపారం చేసుకునే ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ వస్త్ర వ్యాపారి తన భార్య, కుమారుడిని హత్య చేసి ఆ పై తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యాపారి సూసైడ్ నోట్ చదివిన వారి కళ్లు చెమ్మగిల్లేలా చేశాడు.

పోలీసుల వివరాల మేరకు.. మండ్య ప్రాంతానికి చెందిన ప్రభాకర్ (65) అనే వస్త్ర వ్యాపారి గత కొన్ని రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాడు. మానసిక ఒత్తిడి ఎక్కువ కావడంతో మంగళవారం తెల్లవారుజామున తన భార్య జ్యోతి (55)ని చున్నీతో గొంతు నులిమేసి చంపాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన కుమారుడు సంతోష్‌ (30)ను కూడా గొంతు నులిమే హత్య చేశాడు. ఆపై నెహ్రూ నగర్‌లోని తన షాప్‌నకు వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ ఘటన జరిగిన సమయంలో సంతోష్ భార్య గాఢ నిద్రలో ఉన్నట్లు చెబుతున్నారు. సంతోష్‌కు ఓ నెలన్నర కిందటే వివాహం అయినట్లు తెలుస్తోంది. ఆమె యథావిధిగా ఉదయం నిద్రలేచి టిఫిన్ రెడీ చేసి, ఆమె అత్తను నిద్ర లేపేందుకు గదిలోకి వెళ్లగా.. అక్కడ జ్యోతి, సంతోష్ మృతదేహాలు చూసి కంగారు పడింది. వెంటనే ఇరుగుపొరుగు వారికి, బంధువులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

శక్తి ఉచిత బస్సు ప్రయాణమే కారణం?
ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసుకున్న ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన కుటుంబ మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని రాశాడు. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా ఒక కారణమని పేర్కొన్నాడు. ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మహిళలు స్థానికంగా ఉండే చోట కాకుండా నగరాలకు వెళ్లి బట్టలు కొనుగోలు చేస్తున్నారని, దాంతో తమలాంటి చిన్న వ్యాపారులు దివాళా తీస్తున్నారంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

ఒకవైపు వ్యాపారాలు మందగించడం, మరోవైపు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయని.. ఆ అప్పులు తీర్చకపోతే ఫైనాన్స్ వాళ్లు ఇంటి వద్దకు వచ్చి కుటుంబాన్ని వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కుటుంబ గౌరవం, పరువు పోతుతందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై మండ్య జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.

Tags: “Free bus rides are the cause of our deaths” — Businessman strangles wife and son to death, then commits suicide!