మదనపల్లి ముచ్చట్లు:
రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గురువారం మదనపల్లె కలెక్టరేట్లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని, బెల్ట్ షాపులను కఠినంగా నియంత్రించాలని ఆదేశించారు. దీనిపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పందిస్తూ.. ఇతర శాఖల సమన్వయంతో అక్రమార్కులపై ముమ్మర దాడులు నిర్వహిస్తామని, పదేపదే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని మంత్రికి స్పష్టం చేశారు. బార్లు, మద్యం దుకాణాల వద్ద గొడవలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా పెంచినట్లు తెలిపారు. మద్యం విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ అధికారులకు సూచించగా, దుకాణాల పరిసరాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు.
Tags; Crackdown on illicit liquor and ganja!