తిరుచానూరుముచ్చట్లు:
భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఆధునీకరణ
తిరుచానూరు ఆలయ క్యూలైన్లను పరిశీలించిన జేఈవో డా. ఎ. శరత్
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ గురువారం ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో గురువారం పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రాస్ గ్రిల్స్ను పెంచి క్యూలైన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో అధికంగా ఉండే భక్తుల రద్దీతో పాటు ఇతర రోజుల్లో కూడా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
అలాగే తిరుచానూరు ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా గుర్తించేలా ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద ఆకర్షణీయమైన స్వాగత ఆర్చ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, నరసింహమూర్తి, విజీవో గిరిధర్, ఏవీఎస్వో రాధాకృష్ణ, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Enhanced facilities for devotees visiting the Goddess for darshan.