చిలకలూరిపేటముచ్చట్లు:
అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తిని అతి క్రూరంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి హత్య చేసిన కేసులో నిందితులను రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డిఎస్పీ వి. హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు.
కేసు వివరాలు, నేపథ్యం పోలీసుల కథనం ప్రకారం
పేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ (45) టింకరింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడు. అతనికి పట్టణానికి చెందిన షేక్ కాలేషా భార్య మనీషాతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయమై కాలేషా, మనీషా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గొడవల కారణంగా వారు తమ సొంత ఇల్లు వదిలి రెడ్ల బజార్లో అద్దె ఇంట్లోకి మారినప్పటికీ, జాకీర్ హుస్సేన్ – మనీషాల అక్రమ సంబంధం కొనసాగింది.దీనితో విసిగిపోయిన కాలేషా.. “జాకీర్ వల్ల మన కాపురం పాడవుతోంది, వాడిని చంపేస్తే మనం సంతోషంగా ఉండొచ్చు” అని భార్యను ఒప్పించాడు. భర్త పథకానికి మనీషా కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన మనీషా తన ఫోన్ ద్వారా జాకీర్ హుస్సేన్ను పిలిపించింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి జాకీర్ను దారుణంగా కొట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. సాక్ష్యాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని వేలూరు – జాలాది రోడ్డు పక్కన పడవేసి పరారయ్యారు.
పోలీసుల దర్యాప్తు – నిందితుల అరెస్ట్
ఈ నెల 2వ తేదీన మృతదేహాన్ని చూసిన మృతుడి భార్య షేక్ షఫియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు (Cr. No. 60/2026 u/s 103(1), 238 r/w 3(5) BNS). పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డిఎస్పీ పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, ఎస్ఐ జి. అనిల్ కుమార్ మరియు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఎటువంటి క్లూస్ లేని ఈ కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. గురువారం (జూన్ 11) మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం, మానుకొండవారిపాలెం గ్రామ పరిధిలో నిందితులైన షేక్ కాలేషా @ కాలేషా వలి (35), షేక్ మనీషా (31)లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రక్తం తడిచిన చెక్క, తాడుతో పాటు నిందితుల ఫోన్లు, మృతుడిని తరలించేందుకు వాడిన టాటా ఏస్ (TATA Ace) వాహనం, మృతుడి స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ సిబ్బందికి అభినందనలు
క్లిష్టమైన ఈ హత్య కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, ఎస్ఐ శ్రీ జి. అనిల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Tags: Brutal murder over illicit affair: Husband and wife arrested.