June 5, 2026
Explore
రోడ్డు ప్రమాదాల కట్టడికి పకడ్బందీ చర్యలు.

రోడ్డు ప్రమాదాల కట్టడికి పకడ్బందీ చర్యలు.

June 5, 2026 | Andhra Pradesh

. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు!

💠జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, సామాన్య ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శుక్రవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో, రవాణా, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

రహదారి భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు వ్యవసాయ ట్రాక్టర్లకు తప్పనిసరిగా రేడియం రిఫ్లెక్టర్లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించేలా చూడటంతో పాటు, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడే వారిపై, హై బీమ్ లైట్లతో ఎదురుగా వచ్చే వారి కళ్లు మిరుమిట్లు గొలిపేలా వ్యవహరించే వారిపై కొరడా ఝుళిపించాలని స్పష్టం చేశారు. అలాగే, జాతీయ రహదారుల వెంబడి ఉన్న నివాస ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా తగినంత వీధి దీపాల సదుపాయం కల్పించాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు నిర్దేశించిన బస్టాండ్లలో మాత్రమే ఆపాలని, రోడ్డు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రైతులు పొలాల కోసం పైప్‌లైన్ తవ్వకాల కారణంగా అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే తగిన మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. వాహనదారులు లేన్ క్రమశిక్షణ పాటించేలా చూడటంతో పాటు, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారిలో మార్పు కోసం విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సాంకేతికతను జోడిస్తూ ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను (అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం) పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మార్పు తీసుకురావడానికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో “హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు” (నో హెల్మెట్ – నో ఎంట్రీ) అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రవాణా అధికారి డి. అశోక్ ప్రతాప్, అన్నమయ్య జిల్లా డీఆర్‌బీఈఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. అరవింద దేవి, జాతీయ రహదారుల డీఈఈలు పి. మధుసూదన (మదనపల్లె), సుజాత (చిత్తూరు), సి. నాగరాజ (రాయచోటి), మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు దినేశ్ చంద్ర, అజయ్ కుమార్, డీసీఆర్బీ సీఐ ఏ. ఆదినారాయణ రెడ్డి, డీటీఆర్బీ ఎస్ఐ డి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: Comprehensive measures to curb road accidents.