అనకాపల్లి ముచ్చట్లు:
మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఆయనకు భావోద్వేగపూరితమైన నివాళులర్పించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మే 28వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు పాల్గొని, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి చాటిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. “ఆయన పరిపాలనా కాలం ప్రజారంజక పరిపాలనకు ఒక నమూనా. ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి. తెలుగు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి” అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి (మహిళా పిఎస్, అనకాపల్లి) ఇ.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు వెంకట నారాయణ, అశోక్ కుమార్, ఎస్.ఐ. రవికుమార్ లతో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని, ఘన నివాళులు అర్పించారు.
Tags: Grand tribute paid to Nandamuri Taraka Rama Rao at the District Police Office.