అమరావతిముచ్చట్లు:
దశాబ్దాలుగా అసైన్డ్ ఇంటి స్థలాలు కలిగి ఉన్న పేదలకు మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేటాయించి పదేళ్ల గడువు తీరిన ప్రతి అసైన్డ్ ఇంటి స్థలాన్ని లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పేదలకు తమ ఇళ్ల స్థలాలపై పూర్తి స్థాయి శాశ్వత హక్కులు లభిస్తాయి. లబ్ధిదారులు ఈ స్థలాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు, లేదా అమ్ముకోవచ్చు.
🌐 ముఖ్యమైన మార్గదర్శకాలు మరియు నిబంధనలు:
▪️ పదేళ్ల గడువు: ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా కేటాయించి పదేళ్లు పూర్తయిన అసైన్డ్ స్థలాలకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
▪️ అవసరమైన పత్రాలు: రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టా (ఉత్తర్వులు) మరియు స్థానిక సంస్థ జారీ చేసిన ఇంటి పన్ను చెల్లించిన రశీదు సమర్పిస్తే సరిపోతుంది. అదనపు పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) వంటివి అడగకూడదని స్పష్టం చేశారు.
▪️ నిషేధిత జాబితా (22-A) లో ఉన్నా రిజిస్ట్రేషన్: సదరు ఇంటి స్థలాలు ఒకవేళ 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నప్పటికీ, పదేళ్ల గడువు తీరి ఉంటే రిజిస్ట్రేషన్కు అనుమతించాలి.
▪️ లబ్ధిదారుల అర్హత: రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అసలు లబ్ధిదారుడే పొజిషన్లో (స్వాధీనంలో) ఉండాలి. ఒకవేళ అసలు లబ్ధిదారుడు మరణించినట్లయితే, వారి చట్టబద్ధమైన వారసులు మరణ ధ్రువీకరణ పత్రం (Death Certificate) మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
▪️ సర్వే నంబర్ నిర్ధారణ: కేవలం సర్వే నంబర్ ఆధారంగా కాకుండా, ప్లాట్ నంబర్తో పాటు దానికి సరిపోయే సర్వే నంబర్/బ్లాక్ నంబర్ కలయిక ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి.
▪️లావాదేవీలకు గడువు: ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన 90 రోజుల తర్వాత చట్టప్రకారం సదరు ఆస్తిపై కొనుగోళ్లు, అమ్మకాలు లేదా ఇతర లావాదేవీలు చేసుకోవడానికి పూర్తి హక్కులు లభిస్తాయి.
▪️ ఓటీఎస్ (OTS) స్థలాలు: వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) లేదా ఇతర పథకాల కింద క్రమబద్ధీకరించిన ఇళ్లను కూడా నిషేధిత జాబితాలో ఉన్నా సరే, అదనపు పత్రాలు అడగకుండా అసలు హక్కుదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి.
▪️ నకిలీలపై కఠిన చర్యలు: ఫేక్ పట్టాలు, నకిలీ ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్లు 82, 83 ప్రకారం సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
❇️ త్వరలో రెండేళ్లకే హక్కులు: రెవెన్యూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్
పేదలకు మరింత మేలు చేసేందుకు, భవిష్యత్తులో ఇళ్ల స్థలాలపై రెండేళ్లకే శాశ్వత హక్కులు కల్పించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ తెలిపారు. దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
అలాగే, తొలిదశలో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు నిషేధిత జాబితా నుండి విముక్తి కల్పిస్తామని, ఇప్పటికే 1.6 లక్షల ఎకరాల సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి లభించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని 10 వేల గృహాలను కూడా క్రమబద్ధీకరిస్తామని మంత్రి వివరించారు.
Tags: Registration of Assigned House Sites: Rules and Guidelines