July 10, 2026
Explore
మా పాలనలో అభివృద్ధి.. ఇప్పుడు దోపిడీ: శ్రీకాంత్ రెడ్డి

మా పాలనలో అభివృద్ధి.. ఇప్పుడు దోపిడీ: శ్రీకాంత్ రెడ్డి

July 10, 2026 | Andhra Pradesh

రాయచోటి

రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేల పక్కా గృహాలు నిర్మించి పేదలకు అందించామని, సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె వద్ద పట్టణ పేదల కోసం 6 వేల ఇళ్ల కాలనీ ఏర్పాటు చేశామని తెలిపారు. 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, స్టేడియం నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రభుత్వ భూములను రక్షించి, శిల్పారామం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు, రూ.7 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌, రూ.4 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించడం తమ ప్రభుత్వ ఘనతేనని అన్నారు. ప్రజల సంపదను కాపాడి, అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రస్తుతం మాత్రం ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. దౌర్జన్యాలు, డైవర్షన్ రాజకీయాలు మానుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వ్యవస్థలు ఎవరి సొంతం కావని, వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు సహకరించినా చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags: Development during our rule… plunder now: Srikanth Reddy