తెల్లవారకముందే మెయిల్స్
ఫేస్బుక్ మాతృసంస్థ ఉద్యోగుల గుండెకోత
అమరావతిముచ్చట్లు:
రాత్రి పడుకునేటప్పుడు రేపు హ్యాపీగా ఇంటి నుంచే ఆఫీస్ పని చేసుకోవచ్చని అనుకున్నారు.. తీరా తెల్లవారుజామున కళ్లు తెరిచి ఫోన్ చూసుకునేసరికి జీవితం ఒక్కసారిగా అంధకారమైంది. ఫేస్బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా తన ఆఫీసుల్లో గందరగోళం జరగకుండా ఉండేందుకు ఆడిన వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రామా ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల పాలిట ఒక తీరని శోకంగా మారింది. సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తెల్లవారుజామున 4 గంటలకే ఉద్వాసనల మెయిల్స్ పంపడం టెక్ పరిశ్రమలో కార్పొరేట్ క్రూరత్వానికి అద్దం పడుతోంది. ముందస్తు సమాచారం లేకుండా కనీసం ఆఫీసు డెస్క్ దగ్గరకు వచ్చి వస్తువులను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయంగా దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్న మెటాలో ఈ ఒక్క దెబ్బతో 10 శాతం మంది అంటే దాదాపు 8,000 మంది రోడ్డున పడ్డారు. వీరిలో ఎక్కువ భాగం కంపెనీకి వెన్నుముక లాంటి ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాల వారే కావడం గమనార్హం.
Tags: 8,000 Employees Laid Off