తిరుమల ముచ్చట్లు:
రాష్ట్ర సౌభాగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విశ్వరూప దర్శనానికి పోటెత్తిన భక్తజనం
చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మవారికి టిటిడి తరఫున శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రివర్యులు అమ్మవారిని ప్రార్థించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు.
ఏడాదికి ఒక్కసారే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ అర్చకులు మరియు అధికారులు పాల్గొన్నారు.


Tags: Kuppam Prasanna Tirupati Gangamma is blessed with glory. Srivari Saare